హైందవ ధర్మానికి కేసీఆర్ ముప్పు: లక్ష్మణ్
హైదరాబాద్: యాదాద్రిలో అపచారాలు జరుగుతున్నాయని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి .. కాషాయం ధరించి పూజలు, పునస్కారాలు చేస్తే హిందువు అయిపోరని చెప్పారు. హైందవ ధర్మానికి ముఖ్యమంత్రి ముప్పుగా మారారని వ్యాఖ్యానించారు. సాక్షాత్తు ముఖ్తమంత్రే ఆయన శిల్పాలు చెక్కించుకున్నారని గుర్తుచేశారు. స్వామి కంటే ముందు ఆయన్నే భక్తులు దర్శించుకునేందుకు సీఎం కుట్ర చేసినట్లు వెల్లడించారు. మూల విరాట్ను ఉలితో చెక్కడం మహా పాపంగా అభివర్ణించారు. తెలంగాణ కొంగు బంగారం.. యాదాద్రిని ఏం చేయాలనుకుంటున్నారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్.. యాదాద్రి ఆలయాన్ని అడ్డంపెట్టుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్.. మరో గజినిలా తయారయ్యారు..
2 వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయ ప్రతిష్టను సీఎం దిగజారుస్తున్నారని మండిపడ్డారు. సినిమా ఆర్ట్ డైరెక్టర్ను పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు శిల్పాలు చెక్కించడం మంచి పద్ధతి కాదన్నారు. అలాగే పత్రికల మీద ఆంక్షలు సరైంది కాదని హితవు పలికారు. కేంద్రం ఇచ్చే నిధుల మీదనే రాష్ట్ర ప్రభుత్వం ఆధారపడి నడుస్తోందన్నారు. కేటీఆర్ మాటలు దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లు ఉన్నాయన్నారు. కేటీఆర్కు సవాల్ చేస్తున్నా... కేంద్ర నిధులపై బహిరంగ చర్చకు రావాలని లక్ష్మణ్ సవాల్ విసిరారు.